తిరుమల : ఏటా తిరుమలకు పెరుగుతున్న భక్తుల సంఖ్య, ఇటీవల రథసప్తమి సందర్భంగా సుమారు 3.75 లక్షల మంది భక్తులు, 15 వేల వాహనాలు వచ్చిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీపై ముందస్తు అంచనాలు రూపొందించినట్లు తెలిపారు ఈవో ముద్దాడ రవిచంద్ర. తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో భక్తుల రద్దీ, వాహన ట్రాఫిక్ మేనేజ్మెంట్తో పాటు ఆరోగ్యం, పారిశుద్ధ్యం, అన్నప్రసాదం, ఘాట్రోడ్ల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. ముఖ్యంగా గరుడసేవకు అధిక ప్రాధాన్యతనిస్తూ, తిరుమలతో పాటు తిరుపతిలోనూ భక్తుల రాద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. గత బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున సుమారు 20 లక్షల ఫుడ్ పోర్షన్లు, వివిధ రకాల పానీయాలతో పాటు 15 రకాల మెనూలను భక్తులకు అందించినట్లు తెలిపారు. ఈ ఏడాది భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు వంటశాలల ఏర్పాటుతోపాటు అవసరమైన నిత్యావసర సరుకుల సేకరణ, రవాణా ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు.
అదేవిధంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విపత్తు, సంక్షోభ నిర్వహణ, ఎన్డీఆర్ఎఫ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటుపై చర్చించినట్లు తెలిపారు. పోలీసు శాఖ తరపున అవసరమైన సిబ్బంది నియామకం, వారికి వసతి, విధుల కేటాయింపుపై ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. టీటీడీ విజిలెన్స్ విభాగం, సీవీఎస్వో ఆధ్వర్యంలో గత అనుభవాలను పరిగణలోకి తీసుకుని భద్రతా సిబ్బంది మోహరింపుపై నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ దేశంలోని 25 రాష్ట్రాల నుంచి 27 కళాబృందాలు పాల్గొననున్నాయని, ఇందులో రెండు విదేశీ కళాబృందాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఎస్వీబీసీ, సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బ్రహ్మోత్సవాల విశేషాలను కోట్లాది మంది భక్తులకు చేరేలా విస్తృత ప్రచార ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.







