
తయారు చేయాలని ఆదేశించిన చంద్రబాబు
అమరావతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం తరహాలో శ్రీశైల భ్రమరాంభికా మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ది చేయాలని ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో సీఎం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని స్పష్టం చేశారు. శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులను సైతం అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. డోర్నాల, సుండిపెంట, ఈగలపెంట తదితర ప్రాంతాల సమీపంలో ఉన్న జాతీయ రహదారులను దేవాలయానికి కనెక్టు చేసేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆధ్యాత్మికంగా పర్యాటక ప్రాంతంగా, పర్యావరణ పరంగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలని సీఎం పేర్కొన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతున్న కారణంగా ఆలయ సమగ్ర అభివృద్ధికి సత్వర చర్యలు అవసరమని అన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న శబరిమల లాంటి దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధ్యయనం చేసి శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేద్దామని డిప్యూటీ సీఎం ప్రతిపాదించారు.
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలన్నీ అటవీ, గిరులపైనే ఉన్నాయని వారసత్వంగా వచ్చిన ఈ ఆలయాలను అభివృద్ధి చేసుకోవాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుమల తర్వాత అతిపెద్ద ఆలయంగా శ్రీశైలం అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా భక్తులకు విస్తృతమైన సౌకర్యాలను కల్పించాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో సరైన పార్కింగ్ సదుపాయాలు కూడా లేవని అన్నారు. భూమి అందుబాటులో లేకపోతే పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలను కల్పించలేమని.. ఈ నేపథ్యంలో అధికారుల బృందం ఢిల్లీ వెళ్లి అటవీ మంత్రిత్వశాఖకు ఈ అంశాలను వివరించాలని సూచించారు.