
స్పష్టం చేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్
తిరుమల : తిరుమల తిరుపతి పాలక మండలి (టీటీడీ) ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వయో వృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఈవో తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా అవాస్తవమని అన్నారు. వాస్తవం ఏమిటంటే ప్రతిరోజు 1000 మంది వయో వృద్ధులు, దివ్యాంగుల కోసం టిటిడి మూడు నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోందని స్పష్టం చేశారు అనిల్ కుమార్ సింఘాల్. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50/- ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుందని అన్నారు.
తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తూ వస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని ఈవో మరోసారి కోరారు. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించాలని కోరారు. ఇదిలా ఉండగా తాజాగా ఈవో ఆధ్వర్యంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ ఎత్తున భక్తులు స్పందించారు. అడిగిన అన్ని ప్రశ్నలకు ఆయన కూల్ గా సమాధానాలు ఇచ్చారు.