స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులకు అత్యుత్తమ గమ్య స్థానమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత, వేగవంతమైన వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఈరోజు ఢిల్లిలో జరిగిన అమెరికా – భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో (#USISPF) ముఖ్యమంత్రి ప్రసంగించారు.
తెలంగాణలో గత 35 ఏళ్లుగా కాంగ్రెస్తో పాటు అనేక పార్టీలు ప్రభుత్వాలకు సారథ్యం వహించినా పెట్టుబడులకు, పెట్టుబడిదారులకు అందరూ మద్దతుగా నిలిచారని వివరించారు. భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖ ద్వారమని తెలిపారు. జీసీసీలకు గ్యమస్థానంగా ఉన్న హైదరాబాద్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరుతూ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. మహిళా సాధికారిత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్టణాభివృద్ధితో పాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్ను నిలపడమే తన ప్రథమ ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
గత 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సదస్సులో వివరించారు. అద్భుతమైన మౌలిక వసతులతో 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ దేశంలోనే నూతన నగరంగా మారుతుందని చెప్పారు. మూసీ నదీ పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయి, సియోల్ రివర్ఫ్రంట్ల మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని వివరించారు.






