స్పష్టం చేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సంస్థలలో మెరుగైన రీతిలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టిటిడి బాల మందిరం, ఇతర పాఠశాలలలో విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు మరింత మెరుగైన ఉత్తీర్ణతా శాతం పెంచేలా నిపుణులతో శిక్షణ ఇప్పించాలన్నారు. అదేవిధంగా, శ్రవణం ప్రాజెక్ట్ పిల్లలకు శిక్షణ పూర్తి అయ్యాక వినికిడి యంత్రాలను పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టిటిడి ఆసుపత్రులలో రోగులకు ఆసుపత్రుల వారీగా మందుల కొరత ఎక్కడ వుంది, ఏ ఏ మందులు అవసరం ఉంది, రోగులకు అవసరమైన మందులను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా, ఆసుపత్రులలో రోగుల వ్యాధులలో తీవ్రమైన కేసులు, ప్రత్యేకమైన కేసులను నయం చేసేందుకు శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ నుండి నిధులను ఉపయోగించాలన్నారు.
టిటిడి ఆసుపత్రులలో ఔషధాల సరఫరా, ఔషధాల కొనుగోలు ప్రక్రియ, మౌళిక సదుపాయాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు 9 మంది సభ్యులతో కమిటి ఏర్పాటు చేసి నివేదిక తయారు చేయించాలని ఆదేశించారు అనిల్ కుమార్ సింఘాల్. తిరుమలలోని పిఏసీ – 5లో అవసరమైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బందిని నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వి. వీరబ్రహ్మం, ఎఫ్ఏఅండ్ సీఏవో ఓ బాలాజీ, స్విమ్స్ డైరెక్టర్ డా. ఆర్వీ కుమార్, బర్డ్ డైరెక్టర్ డా. జి. జగదీశ్, సీఎంవో డా. కుసుమ కుమారి, పద్మావతీ చిన్న పిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డా. శ్రీనాథ్ రెడ్డి, డీఈవో వెంకట సునీల్ తదితరలు పాల్గొన్నారు.






