1200 గజాల స్థలాన్ని కాపాడిన హైడ్రా
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కబ్జాదారులు, ఆక్రమణదారులకు ఝలక్ ఇచ్చారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. హైడ్రా ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ప్రజా వాణి నిర్వహిస్తూ వస్తోంది. నగరంలోని బాధితులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా, శామీర్పేటలోని ఫ్రెండ్స్ కాలనీలో రోడ్డు ఆక్రమణలను హైడ్రా తొలగించింది. సర్వే నంబరు 1198లో 4.20 ఎకరాల పరిధిలో ఫ్రెండ్స్ కాలనీ పేరిట 1987వ సంవత్సరం లే ఔట్ వేశారు. ఇందులో 20 ఫీట్ల రహదారిని ఆక్రమించి గోడలు నిర్మించారు. గేటు కూడా ఏర్పాటు చేసి పక్కనే ఉన్న ప్లాట్లలోకి కలిపేశారు.
శామీర్పేట పోలీసు స్టేషన్ మీదుగా వెళ్లే దారి బందయ్యిందంటూ హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు అందగా క్షేత్రస్థాయిలో విచారించి రోడ్డు ఆక్రమణను హైడ్రా నిర్ధారించుకుంది. రోడ్డు ఆక్రమణలను తొలగించి కాలనీ వాసులకు హైడ్రా దారి చూపింది. 15 ఏళ్లుగా తాము సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. ఇప్పటికి హైడ్రా చొరవతో తమకు దారి దొరికిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా నగరంలో ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను ఆక్రమించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.






