newsseals.com
News

ఏపీలో రికార్డు స్థాయిలో మిర్చి ఉత్ప‌త్తి

VijayaBhaskar January 23, 2026
newsseals-Atchhannaidu
Spread the love

మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : ఏపీలో రికార్డ్ స్థాయిలో మిర్చి ఉత్ప‌త్తి జ‌రిగింద‌ని చెప్పారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఈ సీజన్‌లో సుమారు 5.39 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధ్యమవుతుందని అంచనా వేశామ‌న్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, నారుమడి పెంపకం, సమగ్ర సస్యరక్షణపై గ్రామస్థాయిలో నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పురుగు మందుల అవశేషాలు లేకుండా నాణ్యమైన మిర్చి ఉత్పత్తి లక్ష్యంగా IPM, INM విధానాలపై శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. డిజిటల్ గ్రీన్, ITC సంస్థల సహకారంతో మిర్చి నాణ్యత ప్రమాణాలు పెంచుతున్నామని తెలిపారు.

గత సీజన్‌లో కామన్ రకాలకు క్వింటాలుకు రూ.12,500, స్పెషల్ రకాలకు రూ.13,500 ధర లభించగా, ఈ ఏడాది ప్రస్తుతం రూ.15,000 నుంచి రూ.19,500 వరకు ధరలు నమోదవుతున్నాయని మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల వల్ల కేవలం మిర్చి మాత్రమే కాకుండా అన్ని పంటలకు కూడా మెరుగైన ధరలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకతలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 1.97 లక్షల మంది రైతులు 2.49 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తుండగా, హెక్టారుకు సగటున 19.81 మెట్రిక్ టన్నుల ఉత్పాదకత సాధిస్తున్నారని చెప్పారు.