మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాష్ ఆర్ పాటిల్
రాయచూర్ : కర్ణాటక రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది మీడియా రంగంలో పని చేస్తున్న జర్నలిస్టులకు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు రాష్ట్ర వైద్య విద్య, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి , రాయచూర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాష్ ఆర్. పాటిల్. రాయచూర్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన జర్నలిస్టులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా పాటిల్ ప్రసంగించారు. తమ వృత్తి ద్వారా సమాజానికి గణనీయమైన కృషి చేసి పదవీ విరమణ చేసిన సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.
ఇందులో భాగంగా ఈ పెన్షన్ పథకం నియమాలు, విధానాలను సరళీకృతం చేయడానికి చర్యలు తీసుకుంటామని డాక్టర్ పాటిల్ స్పష్టం చేశారు. అధికారులతో చర్చించిన తర్వాత, యశస్విని ఆరోగ్య పథకం ప్రయోజనాలను సీనియర్ జర్నలిస్టులకు కూడా విస్తరించాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చించామని, ఇందుకు అందరూ సానుకూలంగా స్పందించారని చెప్పారు. త్వరలోనే విధి విధానాలను రూపొందించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించడం కూడా జరిగిందన్నారు.






