తనలో ఇంకా మార్పు రాలేదని ఆవేదన
విజయవాడ : తన అన్న వైఎస్ జగన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. గురువారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తాను మరోసారి అధికారంలోకి రావాలని కలలు కంటున్నారని, కానీ వర్కవుట్ కావాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుందన్నారు. అంతే కాదు ముందు జగన్ రెడ్డి తను మారాలన్నారు. లేకపోతే వైసీపీ నామ రూపాలు లేకుండా పోతుందన్నారు. గతంలో అధికారం ఉంది కదా అని కొందరు మాత్రమే పవర్ ను ఎంజాయ్ చేశారని, తన చుట్టూ కొందరికే చోటు కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీని కారణంగానే వైసీపీపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. పార్టీ పరంగా ఎందుకు ఓడి పోయామనే దానిపై జగన్ రెడ్డి ఇప్పటి వరకు ఆత్మ పరిశీలన చేసుకోలేక పోయారని అన్నారు షర్మిలా రెడ్డి. మనం అనుకున్నట్లు జనం ఏమంత పిచ్చోళ్లు కాదన్నారు. తమకు నచ్చితే నెత్తిన పెట్టుకుంటారని, కానీ ఒక్కసారి తమను నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిస్తే అధః పాతాళానికి తోసేస్తారని , ఆ విషయం జాగ్రత్తగా గమనించాలని తన సోదరుడు జగన్ రెడ్డికి సూచించారు షర్మిలా రెడ్డి. ఇదిలా ఉండగా తాజాగా షర్మిలా రెడ్డి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి ఏపీ రాజకీయాలలో. మొత్తంగా జగన్ రెడ్డి తను మారితేనే జనం ఆదరిస్తారని, మరోసారి పవర్ లోకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు.






