భక్తికి ప్రతీక వన దేవతల ఆశీర్వాదం
ములుగు జిల్లా : ఆసియా ఖండంలోనే అత్యధిక జనాదరణ కలిగిన ఏకైక జాతర తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని మేడారం మహా జాతర. ఈనెల 28న ప్రారంభమైన మేడారం జాతర జనవరి 30వ తేదీ శుక్రవారం నాటితో ముగుస్తుంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు వన దేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు తమ మొక్కులను తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ కుంభమేళా, భక్తికి ప్రతీక అయిన మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరలో సతీసమేతంగా అమ్మవార్లను దర్శించుకున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. అశేష భక్త జనవాహిని నడుమ, ఆ తల్లుల గద్దెల వద్ద మొక్కులు చెల్లించి, రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని మనసారా వేడుకున్నానని తెలిపారు .
అంతే కాకుండా కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటమే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని అన్నారు మల్లు భట్టి విక్రమార్క. కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి, భద్రత, పారిశుధ్యంపై అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి అడుగులోనూ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తదితరులు పాల్గొన్నారు.







