సంజూ శాంసన్ ఆట తీరు అద్భుతం
ఒడిశా : ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భారత జట్టును ప్రశంసలతో ముంచెత్తారు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలకమైన పోరులో భారత్ అద్బుత విజయాన్ని నమోదు చేసింది. బలమైన లక్ష్యాన్ని అలవోకగా చేదించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు మైదానంలోకి దిగిన టీమిండియా ఆదిలోనే రెండు కీలకమైన వికెట్లను కోల్పోయింది. అయినా ఎక్కడా చెక్కు చెదరకుండా , తొట్రు పాటుకు గురి కాకుండా భారత్ దుమ్ము రేపింది. కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. తానే దగ్గరుండి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
తను 50 బంతులు మాత్రమే ఎదుర్కొని 12 ఫోర్లు 4 సిక్సులతో విరుచుకు పడ్డాడు. విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు శాంసన్. దీంతో సెమీ ఫైనల్ కు చేరుకుంది టీమిండియా. ఈ సందర్బంగా అద్భుత విజయాన్ని సాధించిన భారత జట్టుకు, ప్రత్యేకించి సంజూ శాంసన్ కు అభినందనలు తెలిపారు ఒడిసా మాజీ సీఎం నవీన్ పట్నాయక్. ఆయన ఎక్స్ వేదికగా సందేశం పోస్టు చేశారు. రాబోయే రెండు మ్యాచ్ లలో ఇలాగే ప్రతిభను కనబర్చాలని, టి20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు.






