భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వినతి
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. గతకొంత కాలంగా భక్తులు నియమ నిబంధనలు పాటించడం లేదని పేర్కొంది. ప్రతి రోజూ 70 వేల మందికి పైగా భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో భక్తులకు విశిష్ట సేవలు అందజేస్తున్నామని పేర్కొంది. కొన్ని చోట్ల కొందరు కావాలని తిరుమల పవిత్రతను దెబ్బ తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారని , అలాంటి వారి పట్ల తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించింది. తాజాగా తిరుమల లోని ఔటర్ రింగ్ రోడ్డులో కృష్ణ తేజ అతిథి భవనం సమీపంలోని క్యూలైన్లలో వేచి ఉండే సమయంలో ఇరువురు భక్తులు పరస్పర ఘర్షణ కు దిగిన సంఘటన చోటు చేసుకుంది.
అక్కడ విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు వెంటనే అప్రమత్తం కావడంతో ఘర్షణను నిలువరించడం జరిగిందని టీటీడీ స్పష్టం చేసింది. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు ఈ విధంగా పరస్పర ఘర్షణకు దిగడం సమంజసం కాదని పేర్కొంది. ఓర్పుతో, సహనంతో వ్యవహరిస్తూ తోటి భక్తులతో స్నేహ పూర్వకంగా ఉండాలని ,అదేవిధంగా క్యూలైన్ నియమాలను తప్పనిసరిగా పాటించి స్వామివారిని దర్శించు కోవాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.








