ముగిసిన చంద్ర గ్రహణం భక్తులు క్యూ
తిరుమల : శ్రీవారి ఆలయంలో రాత్రి 8 గంటల నుండి భక్తులకు దర్శనం ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.26 నుండి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 9 గంటలకు ఆలయ తలుపులు మూశారు. దాదాపు 10.30 గంటల అనంతరం రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచారు. ఆలయ శుద్ధి, పుణ్యా హవచనం, కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేసిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సును 7.30 గంటలకు తెరిచారు. వంటశాల శుద్ధి అనంతరం రాత్రి 8.30 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది. అదే విధంగా లడ్డు కౌంటర్లు కూడా పునః ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఈవో.





