అహ్మదాబాద్ లో ఇండియా వర్సెస్ కీవీస్
అహ్మదాబాద్ : అందరి కళ్లు ఇప్పుడు అహ్మదాబాద్ పైనే ఉన్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో తలపడేందుకు సిద్దమయ్యాయి న్యూజిలాండ్, భారత జట్లు. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ పరంగా సమానంగా ఉన్నప్పటికీ టాస్ అన్నది ఇప్పుడు కీలకంగా మారనుంది. లక్షా 30 వేల మందికి పైగా ప్రత్యక్షంగా చూసేందుకు మోదీ స్టేడియం సిద్దమైంది. వ్యాపార, వాణిజ్య, రాజకీయ, కళా, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. ఇప్పటికే ప్రైవేట్ జెట్స్, ఫ్లైట్స్ క్రిక్కిరిసి పోయాయి. అందరూ అహ్మదాబాద్ కు క్యూ కడుతున్నారు. ఉత్కంఠ భరితంగా సాగే ఈ కీలక అంతిమ పోరులో ఇవాళ విశ్వ విజేత ఎవరో తేలి పోనుంది. దీంతో కోట్లాది కళ్లన్నీ ఇప్పుడు జియో హాట్ స్టార్ పైనే కేంద్రీకృతం అయ్యాయి.
ఇక టైటిల్ హాట్ ఫెవరేట్ గా ఉన్న సౌతాఫ్రికాను కోలుకోలేకుండా దెబ్బ కొట్టింది న్యూజిలాండ్. ఆ జట్టును సెమీ ఫైనల్ లో 9 వికెట్ల భారీ తేడాతో ఓడించింది. అందరినీ ఆశ్చర్య పోయేలా చేసింది. మరో వైపు భారత జట్టు అత్యంత కష్టం మీద ఫైనల్ కు వచ్చింది. ఒక రకంగా సర్వ శక్తులు కేంద్రీకృతం చేసింది. క్వార్టర్ ఫైనల్ లో విండీస్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ ను 7 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ కు చేరుకుంది. ఇండియా ఫైనల్ దాకా రావడంలో ముఖ్య భూమిక పోషించాడు సంజు శాంసన్. తను విండీస్ తో 97 రన్స్ చేసి నాటౌట్ గా నిలవగా ఇంగ్లండ్ తో 89 కీలకమైన పరుగులు చేశాడు. ఇవాళ తను ఎలా ఆడతాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది.





