అందించిన రాజేంద్ర జ్యువెలరీ సంస్థ
తిరుపతి : కోట్లాది మంది భక్తులను కలిగిన ఏకైక పవిత్ర స్థలం తిరుమల. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని తలుచుకున్నా లేదా దర్శించుకున్నా, కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఇందులో భాగంగా ప్రతిరోజూ భారీ ఎత్తున ఆదాయం సమకూరుతోంది. అంతే కాకుండా పెద్ద ఎత్తున భక్తులు, సంస్థలు విరాళాలు తమ వంతుగా అందజేస్తున్నారు. ఇందులో భాగంగా టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) కు రూ.10 లక్షలు విరాళం అందింది.
ముంబైకి చెందిన రాజేంద్ర జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ లు బేరూలాల్ జైన్, మీనేష్ జైన్ లు ఈ విరాళాన్ని అందించారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో టిటిడి ఈవో ముద్దాడ రవిచంద్రకు దాతలు విరాళం డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు జి. భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలను టిటిడి ఈవో రవిచంద్ర అభినందించారు.






