శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో
తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి, తోమాల, సహస్ర నామార్చన చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు వేద ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, మేదినీ పూజ, మృత్సం గ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. మంగళవారం ఉదయం 8 నుండి 9 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి.
ఇందులో భాగంగా ఉదయం 6.30 నుండి 8 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం చేపట్టారు. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండ రామస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఆలయ ప్రధాన అర్చకులు ఎపి.ఆనంద కుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.








