కీలక వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు కమల్ హాసన్
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ప్రముఖ నటుడు, ఎంపీ కమల్ హాసన్. శిల్ప కళా వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా తనకు పైడి జయరాజ్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక పురస్కారాన్ని అందుకోవడం సంతోషం కలిగించిందని తెలిపారు. తనకు తెలుగు వారితో, ఇక్కడి ప్రాంతంతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు కమల్ హాసన్. తనకు ఈ అవార్డును ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కు, సీఎం ఎ. రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, పాల్గొన్న, అవార్డులు తీసుకుంటున్న ప్రతి ఒక్కరి పేరు పేరునా అభినందనలు తెలియ చేశారు.
సినిమా అన్నది అద్బుతమైన మాధ్యమమని, సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతిష్టాత్మకమైన పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డును వినయంగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్థను పునరుద్ధరించడం ద్వారా, మీరు కేవలం ఒక గౌరవాన్ని మాత్రమే పునరుద్ధరించ లేదు; కళాత్మక ధైర్యాన్ని, సాంస్కృతిక స్మృతిని, సినిమాలో ప్రజల గళాన్ని గుర్తించడంలో ఇటువంటి వేదికలు పోషించే కీలక పాత్రకు ప్రాణం పోశారని ప్రశంసించారు కమల్ హాసన్..







