వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు
అమరావతి : ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. శనివారం శాసన సభలో సీఎం ఆధ్వర్యంలో రాజధానిగా అమరావతి కోసం తీర్మానం ప్రవేశ పెట్టారు. కూటమికి చెందిన ప్రజా ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్బంగా స్పందించారు మంత్రి. హైదరాబాద్ వదిలి వచ్చిన సాహసం…ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం అన్నారు.
హైదరాబాద్ను వదిలి స్వంత రాష్ట్రంలోనే పరిపాలన కొనసాగించడం ఒక ధైర్య నిర్ణయమని, అది భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేయడానికేనని పేర్కొన్నారు. ఈ క్రమంలో 2014 లో పవన్ కళ్యాణ్ మద్దతును ప్రస్తావిస్తూ, రాష్ట్ర అభ్యున్నతికి కలిసికట్టుగా పని చేసిన విషయాన్ని చెప్పారు. అయితే 2019 తర్వాత ఏర్పడిన పరిస్థితుల్లో ప్రజల ఆశయాలు దెబ్బతిన్నాయని వాపోయారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని గందరగోళానికి గురిచేశాయని విమర్శించారు. వైఎస్ జగన్ ప్రాంతాలు, కులాలు , మతాల మధ్య చిచ్చు పెట్టటం, శాసనసభకు రాకుండా, బయట బ్రోకర్లతో మాట్లాడిస్తాడని ఆరోపించారు. ప్రజలు కూడా వైసీపీ లాంటి రాజకీయ పార్టీ అవసరమా అనేది ఆలోచించాలని అన్నారు. రాజధాని అంశాన్ని వివాదాస్పదంగా మార్చడం, ప్రజల మధ్య విభేదాలు పెంచడం వంటి చర్యలు రాష్ట్ర పురోగతిని దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ఆటంకాలను ఎదుర్కొంటూ అమరావతిపై నమ్మకాన్ని నిలబెట్టిన నాయకత్వం ఇప్పుడు చట్టబద్ధత తీసుకు వచ్చిందని, ఇది కేవలం పరిపాలనా నిర్ణయం మాత్రమే కాకుండా తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటే చారిత్రాత్మక అడుగు అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.





