నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగిందన్నారు. హామీగా కాకుండా బాధ్యతగా తమ కూటమి సర్కార్ భావించిందని పేర్కొన్నారు. అందుకే చేనేత కార్మికులు, కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కళ్లారా చూశానని, తట్టుకలేక పోయానని పేర్కొన్నారు. ఇందు కోసం వారి బతుకుల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతోనే తాము ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కుటుంబాలకు మేలు చేకూరుతుందన్నారు.
మగ్గం ఆడితేనే ఇంట్లో దీపం వెలిగే నేతన్నల కష్టాన్ని అర్థం చేసుకుని ఈ స్కీంను తీసుకు వచ్చామన్నారు . రాష్ట్రంలోని 93 వేల చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, 11,488 మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఈరోజు నుంచే అమల్లోకి వస్తోందన్నారు. విద్యుత్ను రాయితీగానే కాదు…ఒక్కో నేతన్న కష్టానికి ఇస్తున్న గౌరవం అని స్పష్టం చేశారు సీఎం . వారి వృత్తికి కలిగిస్తున్న భరోసా. ఏడాదికి రూ.150 కోట్లు ఖర్చవుతున్నా… అంతకంటే ప్రభుత్వానికి ముఖ్యమైనది నేతన్నల చిరునవ్వు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.8 వేల నుంచి రూ.21 వేల దాకా ఆదా కలిగించడంతో పాటు వారి జీవన స్థాయిని మెరుగు పరచేందుకు వేసిన పెద్ద అడుగు అని పేర్కొన్నారు.





