రావాలని కోరిన గురుద్వారా కమిటీ
హైదరాబాద్ : హైదరాబాద్ లోని అమీర్పేట్ గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో వచ్చే వారం ఘనంగా నిర్వహించనున్న ఖల్సా సాజన దివస్ – వైశాఖి వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని గురుద్వారా ప్రతినిధులు శుక్రవారం తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించారు. అమీర్పేట్ గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ ఎస్. దర్శన్ సింగ్ ఆధ్వర్యంలోని బృందం కేటీఆర్ ని, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భేటీ అయ్యారు.ఈ వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఏప్రిల్ 14, మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు అమీర్పేట్లోని శ్రీ గురు గోవింద్ సింగ్జీ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ (మున్సిపల్ ప్లే గ్రౌండ్స్)లో జరగనున్న ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కావాలని వారు కోరారు. పంజాబ్ నుండి విచ్చేసిన ప్రముఖ మత ప్రచారకుల చేత గుర్బానీ కీర్తనలు , ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించ బడుతున్నాయని, ఈ వేడుకలకు సుమారు 8,000 నుండి 8,500 మంది భక్తులు హాజరవుతారని కమిటీ ప్రతినిధులు వివరించారు. సిక్కు సమాజం అత్యంత పవిత్రంగా జరుపుకునే ఈ పండుగలో పాల్గొని గురు సాహెబ్ ఆశీస్సులు తీసుకోవాలని వారు కేటీఆర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో గురుద్వారా సాహెబ్ అమీర్పేట్ కమిటీ సభ్యులు , ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.





