కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్
తిరుపతి జిల్లా : ఏపీని క్రీడా రంగంలో టాప్ లో నిలిపేందుకు కృషి చేస్తామని ప్రకటించారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. బుధవారం తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో రూ.5.35 కోట్ల వ్యయంతో కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ, 200 మంది క్రీడాకారులకు వసతి సదుపాయం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన జూనియర్ బాక్సింగ్ రింక్ ను ప్రారంభించారు. గూడూరు నియోజకవర్గం కోటలో రూ.2.31 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం, సూళ్లూరుపేటలో రూ.2.70 కోట్ల వ్యయంతో క్రీడా వికాస కేంద్రం నిర్మాణానికి , రేణిగుంట ఏపీఎస్టీఆర్ఈఐఎస్ స్కూల్ లో రూ.80 లక్షల వ్యయంతో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ రవాణ, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సి.షణ్ముగ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ శ్రీపతి బాబు, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, సూర్య చరిష్మ తమిరి, దండు పూజ, నవ్య కందేరి, భారత అంధ క్రికెటర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి, అంధ మహిళా క్రికెటర్ పంగి కరుణ కుమారి, పారా అథ్లెట్ రవి రంగలి, పారా సైక్లిస్ట్ షేక్ అర్షద్, పారా అథ్లెట్ కె.లలిత, ఆర్చరీ ప్లేయర్ టి.గణేష్ మణిరత్నం, భారత హాకీ క్రీడాకారిణి రజని ఇటిమరపు తదితరులు పాల్గొన్నారు.








