పిలుపునిచ్చిన ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) వై. నాగిరెడ్డి తెలిపారు. కార్మికుల డిమాండ్లపై సమగ్రంగా చర్చించేందుకు సర్కార్ ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ఈ కమిటీ కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపిందని ఆయన వివరించారు. కార్మికులు కోరుతున్న డిమాండ్లలో కొన్ని ఆర్థిక పరమైనవని, సంక్లిష్టమైన అంశాలు ఉన్నందున, వాటిని లోతుగా పరిశీలించి పరిష్కరించడానికి ప్రభుత్వానికి కనీసం నాలుగు వారాల సమయం పడుతుందని స్పష్టం చేసిందన్నారు.
ఈ మేరకు ప్రభుత్వం గడువు కోరినట్లు నాగిరెడ్డి వెల్లడించారు. సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే, కొన్ని సంఘాలు వాస్తవాలను విస్మరించి సమ్మెకు పిలుపునిస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన ఆక్షేపించారు. ఇటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా, సంస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కార్మికులందరూ విధులకు హాజరై ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆర్టీసీపైనే ఆధారపడి ప్రయాణించే దినసరి కూలీలు, చిరు ఉద్యోగులు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందన్నారు. అందరూ బాధ్యతాయుతంగా విధుల్లో పాల్గొనాలని ఎండి నాగిరెడ్డి కోరారు.





