మాజీ ఎమ్మెల్యే వర్మ తీరుపై సీఎం సీరియస్
అమరావతి : రాష్ట్రంలో కూటమి నేతల మధ్య ప్రోటోకాల్, ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఆయా పార్టీల అధినేతలు సర్ది చెప్పేందుకు ప్రయత్నం చేసినా అక్కడక్కడా వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా పిఠాపురం శాసనసభ నియోజకవర్గంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తారాస్థాయికి చేరింది. టీడీపీ, జనసేన పార్టీల నేతలు వాగ్వావాదానికి దిగారు. ఈ రగడ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆ వెంటనే ఆయన తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మల్యే పల్లా శ్రీనివాసరావుతో ఫోన్ లో మాట్లాడారు.
అసలు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రోటోకాల్ వివాదం ఎందుకు చోటు చేసుకుందని ప్రశ్నించారు.
పిఠాపురం ప్రోటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే వర్మ తీరును తీవ్రంగా తప్పు పట్టారు . తను వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐక్యంగా ఉండాల్సిన నేతలు ప్రోటోకాల్ పేరుతో ఘర్షణ పడటం సరికాదన్నారు. ఎవరి హద్దుల్లో వారు ఉండాలని స్పష్టం చేశారు. ఇలాంటి వివాదాలు ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేస్తాయన్నారు.





