సింగపూర్ లో కొనసాగుతున్న అధికారిక పర్యటన
సింగపూర్ : ఏపీకి చెందిన మంత్రులు సింగపూర్ లో పర్యటిస్తున్నారు . ఈ పర్యటనలో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి, అనగాని సత్య ప్రసాద్, కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు నారాయణ, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ , తదితరులతో పాటు ఉన్నతాధికారులు ఉన్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్లోని PSA ఆధ్వర్యంలో నడుస్తున్న టువాస్ (TUAS) పోర్ట్ను 3వ రోజు సహచర మంత్రులతో కలిసి సందర్శించారు అనిత వంగలపూడి . 2040 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద, పూర్తిగా ఆటోమేటెడ్ టెర్మినల్గా రూపుదిద్దుకుంటున్న ఈ పోర్ట్లోని డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాలు, రిమోట్ కంట్రోల్ క్రేన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత లాజిస్టిక్స్ వ్యవస్థలు, ‘గ్రీన్ పోర్ట్’ విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించడం ఆనందంగా ఉందన్నారు.
ఇదిలా ఉండగా ఇది ఎంతో ఉపయోగకరంగా, స్పూర్తి దాయకంగా ఉంటుందన్నారు మంత్రి. ఇక్కడి అత్యాధునిక సాంకేతికతను, సమర్థవంతమైన పాలనా విధానాలను మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, ముఖ్యంగా రాష్ట్రంలోని పోర్టుల ఆధునీకరణలో అమలు చేసేందుకు ఈ పర్యటన ఎంతో దోహద పడుతుందన్నారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. సింగపూర్ అభివృద్ది ఎలా చెందిందనే దానిపై ఆరా తీశామన్నారు.





