ఉతికి ఆరేసిన వైభవ్ సూర్యవంశీ
జైపూర్ : కళ్లు చెదిరే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకు పడ్డాడు యంగ్ క్రికెటర్ రాజస్తాన్ బ్యాటర్ , ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. తనకు బౌలర్లంటే భయం లేదని ఇప్పటికే ప్రకటించి సంచలనంగా మారాడు. తాజాగా ఐపీఎల్ 2026లో తన అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకోవడమే కాదు. సూపర్ షోతో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు. అవతల ఎంతమంచి బౌలర్లు ఉన్నా పట్టించుకోవడం లేదు. ఫోర్లు, సిక్సర్లతో బాదడమే పనిగా పెట్టుకున్నాడు. తాజాగా జైపూర్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 36 బంతులు ఎదుర్కొని 103 రన్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ విండీస్ వీరుడు క్రిస్ గేల్ మీదనే ఉంది. తను 175 రన్స్ చేశాడు. తన రికార్డును అధిగమిస్తాడని అంతా భావించారు. కానీ వర్కవుట్ కాలేదు. సెంచరీ తర్వాతి బంతికే స్కూప్ షాట్ ఆడబోయి ఎల్బీగా ఔటయ్యాడు. వైభవ్ వికెట్ దక్కడంతో సన్రైజర్స్ బౌలర్లు హమ్మయ్య బతికి పోయాం అని ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ లో 2013లో పూణేపై 30 బంతుల్లో గేల్ సెంచరీ చేశాడు. 35 బంతుల్లో హైదరాబాద్ పై వైభవ్ శతకం బాదాడు. ముంబై ఇండియన్స్ పై యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లో సెంచరీ చేశాడు. సీఎస్కే పై ప్రియాంశ్ ఆర్య 38 బంతుల్లో , ఆర్సీబీపై పంజాబ్ తరపున మిల్లర్ 38 బంతుల్లో శతకం చేశారు.





