స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా ఆంధ్రప్రదేశ్లో సీసీ టీవీ కెమేరాల ఏర్పాటు, వాటి వినియోగం, పర్యవేక్షణ జరుగుతోందని అన్నారు. దీనివల్ల రాష్ట్రంలో నేరాల నియంత్రణ, నేరస్తులను గుర్తించడంతో పాటు… మిస్సింగ్ కేసుల ట్రేసింగ్, వాహనాల దొంగతనాల వంటి కేసులు వేగంగా కొలిక్కి వస్తున్నాయని చెప్పారు. అయితే సీసీ కెమేరాలు లేని ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల డేటాను కూడా ఇంటిగ్రేట్ చేయాలని, ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
సీసీ కెమేరాలతో పాటు శాటిలైట్ డేటాను వినియోగించు కునేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం నిర్దేశించారు. శాటిలైట్ సమాచారాన్ని ఆర్టీజీఎస్ కు అనుసంధానించి వేగంగా చర్యలు చేపట్టేలా చూడాలన్నారు. ఇటీవల తిరుమల-తిరుపతి సమీపంలో శేషాచల అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించిన ఘటనపై వేగంగా స్పందించే అవకాశం ఉండేదన్నారు. డీజిల్, పెట్రోలు సరఫరా పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలతో మళ్లీ సాధారణ స్థితికి నెలకొందని… అయితే సమస్య ఉత్పన్నం కాకముందే రియల్ టైమ్లో స్పందించేలా చర్యలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు.






