వెల్లడించిన మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి : ఏపీ సీడ్స్ ద్వారా సరఫరా చేసే ప్రతి విత్తనాన్ని సంబంధిత ప్రయోగశాలల్లో నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తరువాత మాత్రమే రైతు సేవా కేంద్రాలకు పంపిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలే అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2025-26 సంవత్సరం నుంచి గ్రామీణ విత్తనోత్పత్తి పథకానికి ప్రత్యామ్నాయంగా కొత్త విత్తన రకాల పెంపొందించడానికి తోడ్పాటు అనే సవరించిన సమగ్ర పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 1,03,901 క్వింటాళ్ల విత్తనోత్పత్తి జరిగిందని, 2026-27 సంవత్సరానికి 1,20,678 క్వింటాళ్ల విత్తనోత్పత్తి లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామని చెప్పారు.
గత ప్రభుత్వం 2019-20 నుంచి 2023-24 వరకు రాయితీ విత్తనాలు సరఫరా చేసిన సంస్థలకు రూ.476.94 కోట్ల బకాయిలు ఉంచిందని మంత్రి విమర్శించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించిన పూర్తి చెల్లింపులు ఇప్పటికే విడుదల చేసిందని, 2025-26 సంవత్సరానికి సంబంధించిన చెల్లింపుల ప్రక్రియ కూడా కొనసాగుతోందని తెలిపారు. రైతులకు వివిధ పంటలపై ఆకర్షణీయమైన రాయితీలు కొనసాగిస్తున్నామని మంత్రి వెల్లడించారు.






