నోరి దత్తాత్రేయకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంస
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ వైద్యులు అయిన నోరి దత్తాత్రేయ ను అభినందించారు. ఈరోజు తనను కలుసుకుని, తాను ఎంతో శ్రమించి రూపొందించిన “తెలంగాణ క్యాన్సర్ అట్లాస్”ను సమర్పించారు. ఈ సందర్బంగా చాలా బాగుందంటూ కితాబు ఇచ్చారు. ఇలాంటి నివేదికలు ఎంతగానో ఉపయోగ పడతాయని పేర్కొన్నారు సీఎం. ఈ నివేదిక, అధిక క్యాన్సర్ కేసులున్న ప్రాంతాలను గుర్తించడానికి, వాటి కారణాలను పరిశోధించడానికి, క్యాన్సర్పై పోరాడేందుకు సహాయ పడటానికి ఉపయోగ పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ నివేదికలో అందించిన సమాచారం ఆధారంగా, అధిక క్యాన్సర్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో తాము ప్రత్యేక స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆరోగ్యశ్రీ పథకం కింద కార్పొరేట్ ఆసుపత్రులలో క్యాన్సర్ చికిత్స అందించాలనే సూచన వచ్చిందని, దానిని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.





