టీటీడీ ఔషధ వనాల పెంపకానికి ప్రాధాన్యత
తిరుమల : భక్తులకు విశిష్ట సేవలు అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) పచ్చదనం, పర్యావరణం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకాన్ని చేపట్టింది. అలాగే తిరుమల, టీటీడీ ఆలయ అవసరాల కోసం శ్రీగంధం చెక్కలు, వంట చెరుకు, దర్భ గడ్డి, ఇతర పూజా సామగ్రిని టీటీడీ ఫారెస్ట్ విభాగం సమకూరుస్తోంది. తిరుమల, తిరుపతిలోని రహదారి డివైడర్లు, ఉద్యాన వనాలు, పచ్చదన అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. మొత్తం 24 కిలోమీటర్ల మేర రహదారి డివైడర్లు, 25 ఉద్యానవనాలను సంరక్షిస్తోంది.
అరుదైన , ఔషధ గుణాలు కలిగిన వృక్ష జాతుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిన టీటీడీ, ఆయుర్వేద ఔషధాల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను కూడా సరఫరా చేస్తోంది. ప్రస్తుతం పవిత్ర వనం, దివ్య ఔషధ వనం, పాలమనేరు టింబర్ ప్లాంటేషన్, వన్యప్రాణి ఘర్షణల నివారణకు వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యం, కొండల పచ్చదనం పెంపు వంటి పలు కీలక ప్రాజెక్టులను టీటీడీ ఫారెస్ట్ విభాగం అమలు చేస్తోంది. పవిత్ర అరణ్య సంపదను సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ప్రకృతి వారసత్వాన్ని అందించడం టీటీడీ అటవీ విభాగం ప్రధాన లక్ష్యంగా పని చేస్తోంది.







