ఇళ్ళలోకి చొచ్చుకొచ్చి నానా బీభత్సం
రాజస్థాన్ : ఇసుక తుపాను దెబ్బకు రాజస్థాన్ విల విల లాడింది. రాజస్తాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఊరట లభిస్తుందనుకుంటే, ప్రకృతి ఊహించని విధంగా ఇసుక తుపాను రూపంలో విరుచుకు పడింది. రాజస్థాన్లోని చురు జిల్లా ను ఒక భీకర ఇసుక తుపాను గుప్పిట్లోకి వెళ్లిపోయింది. మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల సమయంలో ఆకాశం ఒక్కసారిగా రంగు మారి, భారీ ఇసుక మేఘాలు నగరాన్ని కమ్మేశాయి.
కేవలం కొద్ది నిమిషాల్లోనే ఇసుక గోడలా విరుచుకు పడటంతో, పట్టపగలే చిమ్మ చీకటి అలుముకుంది. అప్పటి వరకు ఎండతో అల్లాడిన జనం, ఈ హఠాత్తు పరిణామంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గాలిలో ఇసుక రేణువుల ధాటికి వాహనదారులు కనీసం ఎదురుగా ఉన్న రోడ్డును కూడా చూడలేక వాహనాలను ఎక్కడికక్కడ నిలిపి వేశారు. పెద్ద ఎత్తున ఇసుక తుపాను ముంచెత్తింది. ఇళ్లలోకి ఇసుక వచ్చింది. దీంతో ఇళ్లల్లో ఉన్న ప్రజలు బెంబేలెత్తి పోయారు. దాదాపు గంటకు పైగా దుమ్ము రేపింది. ఆతర్వాత శాంతించడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద ఎత్తున నష్టం చేకూరింది ఇసుక తుపాను కారణంగా.





