తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి వార్షిక అవతారోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి ఆదివారం నుంచి. ఈ ఉత్సవాలు ఈనెల 7వ తేదీ వరకు కొనసాగుతాయి. టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఊంజల్సేవ, వాహన సేవలు భక్తిశ్రద్ధల మధ్య జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం సుప్రభాతం, సహస్ర నామార్చన, నిత్యార్చన కొనసాగుతోంది.
అనంతరం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సుందర రాజస్వామి వారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, పసుపు, చందనంతో మహా అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ఊంజల్సేవ జరుగుతుంది. ఆదివారం పెద్దశేష వాహనంపై శ్రీ సుందర రాజస్వామి వారి దివ్య విహారం చేశారు. 6న సోమవారం హనుమంత వాహనంపై స్వామివారి మహోత్సవ విహారం ఉంటుంది. 7న గరుడ వాహనంపై స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
ప్రతి రోజు రాత్రి జరిగే ఈ వాహనసేవల్లో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు.















