క‌వి యోధుడు అందెశ్రీ‌కి మ‌ర‌ణం లేదు : సీఎం

VijayaBhaskar · November 11, 2025
Spread the love

ముగిసిన గాయ‌కుడి అంతిమ యాత్ర

హైద‌రాబాద్ : క‌వి, రచ‌యిత, ఉద్య‌మ గొంతుక , తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మంగ‌ళ‌వారం అంతిమ యాత్ర ముగిసింది. పార్థీవ దేహాన్ని సంద‌ర్శించి ఘ‌నంగా నివాళులు అర్పించారు. టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్, మంత్రులు అడ్లూరి ల‌క్ష్మ‌ణ్, దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబుతో పాటు ప‌లువురు హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌కు హృద‌య పూర్వ‌క నివాళులు అర్పించారు. ఎంతో కాలంగా అత్యంత సన్నిహితంగా మెలిగిన అందెశ్రీ ఆకస్మిక మరణంతో భారమైన హృదయంతో ముఖ్యమంత్రి చివ‌రి, అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అంతిమయాత్రలో పాల్గొన్న రేవంత్ రెడ్డి అందెశ్రీ పాడె మోశారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, సాహితీప్రియులు అక్షరయోధుడికి కడసారి వీడ్కోలు పలికారు.

మొదట లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్‌కేసర్ ఎన్ఎఎఫ్‌సీ నగర్ వరకు అందెశ్రీ అంతిమ యాత్ర సాగింది. అందెశ్రీ సతీమణి మల్లుబాయి, కుమార్తెలు వాక్కులమ్మ, వెన్నెల, వేకువ, కుమారుడు దత్తు సంప్రదాయం పద్ధతిలో కర్మకాండలను నిర్వహించారు. అధికారిక లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. రేవంత్ రెడ్డి అందెశ్రీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమ సంస్కార కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించారు. సాహిత్య సమరయోధుడి అంతిమయాత్రలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు.