newsseals.com
News

కేర‌ళ సీఎం ప‌నితీరు అద్భుతం : రామచంద్ర యాద‌వ్

VijayaBhaskar November 26, 2025
newsseals-BodeRamachandraYadav
Spread the love

తాను రాసిన లేఖ‌కు నిమిషాల్లోనే స్పందించార‌ని ప్ర‌శంస‌

చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును ఏకి పారేశారు బీసీవై పార్టీ అధ్య‌క్షుడు బోడె రామ‌చంద్ర యాద‌వ్. శబరిమలలో తెలుగు భక్తులు పడుతున్న ఇబ్బందులపై తాను కేరళ సీఎంకు లేఖ రాశానని, కేవ‌లం గంటలు గడవకముందే ఆ సమస్యను పరిష్కరించాలని సంబంధిత మంత్రిని ఆదేశించార‌ని తెలిపారు. ఈ విష‌యం త‌న కార్యాలయం నుంచి అధికారికంగా స్పందన వచ్చిందన్నారు. ఇది ఒక బాధ్యతగల ముఖ్యమంత్రి పనితీరుకు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధం అంటూ మండిప‌డ్డారు బోడె రామ‌చంద్ర యాద‌వ్.

గత కొన్ని నెలలుగా, రైతుల కష్టాలు, టీటీడీలో భక్తుల సమస్యలు, డీఎస్సీ అభ్యర్థుల ఆవేదన, రాజధాని గెజిట్ నోటిఫికేషన్, అశాస్త్రీయ జిల్లాల పునర్వ్యవస్థీకరణ వంటి అనేక కీలక అంశాలపై తాను సుమారు 8 సార్లు లేఖలు రాశానని అన్నారు. ఇవన్నీ లక్షలాది మంది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న సమస్యలు. కానీ, చంద్రబాబు నుంచి గానీ, ఆయన కార్యాలయం నుంచి గానీ ఇంతవరకు కనీసం ‘మీ లేఖ అందింది’ అన్న చిన్న సమాధానం కూడా రాలేదని ఆరోపించారు. ఇది ప్రజల సమస్యల పట్ల ఆయనకున్న నిర్లక్ష్యానికి, అహంకారానికి నిదర్శనం అని రామచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు.

అధికారం అంటే అహంకారం ప్రదర్శించడం కాదు, ప్రజల పట్ల బాధ్యతగా ఉండటం. దయచేసి, చంద్రబాబు ఆ బాధ్యత అంటే ఏంటో కేరళ సీఎం పినరయి విజయన్‌ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.