అసైన్డ్‌ భూములపై చర్చించాం : నారాయ‌ణ

VijayaBhaskar · November 29, 2025
Spread the love


రాజధాని రైతుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిస్తాం

అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖా మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అమ‌రావ‌తి రాజధానిలో రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామ‌ని అన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టికే సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు కీల‌క క‌మిటీని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇందులో త‌న‌తో పాటు కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ కూడా ఉన్నార‌ని చెప్పారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు స‌మావేశం కావ‌డం జ‌రిగింద‌న్నారు. రాజ‌ధాని నిర్మాణం కోసం స్వ‌చ్చంధంగా త‌మ భూములు ఇచ్చిన రైతుల‌కు న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. చాలా మంది రైతుల‌కు ఇప్ప‌టికే ప‌రిహారం అంద‌జేశామ‌న్నారు.

ఇదిలా ఉండ‌గా సమస్యలు మా దృష్టికి రాగానే అధికారులకు ఆదేశాలిస్తున్నట్లు చెప్పారు మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. గ్రామ కంఠాల్లో కొందరికి అన్యాయం జరిగిందని చెబుతున్నారని, దీనిపై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెడ‌తామ‌ని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్‌ భూములపై అధ్యయనానికి రెవెన్యూ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారని వెల్ల‌డించారు. ఇందులో తాను కూడా సభ్యుడిగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు పొంగూరు నారాయ‌ణ‌. ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై అసైన్డ్‌ భూములపై చర్చించాం అన్నారు.