పేద‌ల‌కు నాణ్య‌మైన వైద్యం అందించాలి

VijayaBhaskar · January 24, 2026
Spread the love

స్ప‌ష్టం చేసిన మాజీ ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌

అమ‌రావ‌తి : కార్పొరేట్ ఆస్పత్రులు పేద‌ల‌కు త‌క్కువ ఖ‌ర్చుతో వైద్యం అందించేందుకు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు. చిన్నకాకానిలోని ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రాంగణంలో అత్యాధునిక ‘క్యాథ్ ల్యాబ్’ను ప్రారంభించడం ఆనందంగా ఉంద‌న్నారు. ఇదే స‌మ‌యంలో కొత్త ఆడిటోరియానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి. కేవలం 30 మంది ప్రవాస భారతీయ వైద్యుల ప్రయత్నాలతో ప్రారంభమైన ఈ సంస్థ, నేడు 1050 పడకలకు విస్తరించ‌డం ప‌ట్ల ప్ర‌త్యేకంగా యాజ‌మాన్యాన్ని అభినందించారు, పేదలకు రాయితీపై నాణ్యమైన వైద్య చికిత్సను అందిస్తుండటం ప్రశంసనీయం అని పేర్కొన్నారు.

భారతదేశంలో 60% మరణాలు జీవనశైలి వ్యాధుల (NCDలు) కారణంగానే సంభవిస్తున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు. అనారోగ్యం వల్ల కుటుంబాలకు ఆర్థిక నష్టం కలగడంతో పాటు, దేశ ఆర్థిక ప్రగతి కూడా మందగిస్తుందన్నారు. వైద్యులు కేవలం చికిత్సకే పరిమితం కాకుండా, యోగా, వ్యాయామం, సరైన పోషకాహారం గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవస‌రం ఉంద‌న్నారు. ఆరోగ్యకరమైన సమాజమే భారతదేశ అభివృద్ధికి నిజమైన పునాదని స్పష్టం చేశారు. ప్రకృతికి దగ్గరగా ఉంటేనే ఆరోగ్యం మెరుగు పడుతుందని అన్నారు. పాశ్చాత్య ఆహారాన్ని వదిలి, జొన్నలు, రాగులు వంటి తృణ ధాన్యాలను మన ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. వైద్య విద్యార్థులు తమ వృత్తి జీవితంలో కొంత సమయాన్ని గ్రామీణ సేవకు కేటాయించాలని కోరారు. నివారణ చికిత్స కంటే ఉత్తమమైనది అనే అవగాహనను వ్యాపింప జేయాలన్నారు.