గోదావరి జిల్లా ప్రేమ ఆప్యాయతల విందు
అమరావతి : గోదావరి జిల్లా పరిధిలోని కాకినాడ, అమలాపురం పార్లమెంటు కూటమి ప్రజా ప్రతినిధులు వారి కుటుంబసభ్యులకు మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో ఇచ్చిన విందు ప్రేమ ఆప్యాయతలతో సాగింది. గోదావరి జిల్లాలకు వెళితే ఎంత చక్కటి ఆతిథ్యం ఇస్తారో..అదే అతిథి మర్యాదలతో ఆత్మీయ కలయిక ఆనందంగా గడిచింది. గోదావరి జిల్లాకే ప్రత్యేకమైన రుచులు, చిత్రాలు, ప్రతిమలతో ఆతిథ్యం ఇచ్చిన లోకేష్ ను సత్కరించారు. ఈ సందర్భంగా లోకేష్ నేతలపై ఓ బాధ్యత మోపారు. తన తమ్ముడు అమలాపురం ఎంపీ జీఎం హరీష్ బాలయోగికి మూడు నెలల్లో పెళ్లి చేయాలని, సంబంధాలు చూడాలని ప్రజా ప్రతినిధులను కోరారు. ప్రేమ పెళ్లిళ్ల గురించి ఆసక్తికరమైన చర్చ సాగింది. ప్రేమించి, ఇరుపక్షాలనూ ఒప్పించి పెళ్లి చేసుకున్నామని..ప్రేమ వివాహమే మా జీవితాలకు వెలుగు నిచ్చిందని ఎంపీ సానా సతీష్ బాబు, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తమ ప్రేమ పోరాటాలను, పెళ్లి విజయాలను చెప్పారు.
ఆయా ప్రజాప్రతినిధులు తమ పరిధిలో అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారం కోసం మంత్రి నారా లోకేష్ కు ఇచ్చిన దరఖాస్తుల తాజాస్థితిని తెలుపుతూ ఓ నివేదికను ప్రజా ప్రతినిధులకు అందజేశారు. తన ఆహ్వానాన్ని మన్నించి ఆత్మీయ కలయికకు హాజరైన ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులకు మంగళగిరి పట్టుచీరలను లోకేష్ బహూకరించారు. ఈ ఆత్మీయ కలయికకు కాకినాడ పార్లమెంటు నుంచి ఎంపీ సానా సతీష్ బాబు (రాజ్యసభ), ఎమ్మెల్యేలు వరుపుల సత్యప్రభ (ప్రత్తిపాడు), వనమాడి వెంకటేశ్వరరావు (కాకినాడ సిటీ) , పంతం వెంకటేశ్వరరావు (కాకినాడ రూరల్ జనసేన), జ్యోతుల వెంకట అప్పారావు నెహ్రూ (జగ్గంపేట), ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, పిడుగు హరిప్రసాద్…అమలాపురం ఎంపీ జీఎం హరీష్ బాలయోగి, ఎమ్మెల్యేలు మంత్రి వాసంశెట్టి సుభాష్ (రామచంద్రాపురం), దాట్ల సుబ్బరాజు (ముమ్మిడివరం), అయితాబత్తుల ఆనందరావు (అమలాపురం), దేవ వరప్రసాద్ (రాజోలు జనసేన), గిన్ని సత్యనారాయణ (పి గన్నవరం జనసేన), బండారు సత్యానందరావు (కొత్తపేట), వేగుళ్ల జోగేశ్వరరావు (మండపేట) కుటుంబాలు హాజరయ్యారు.







