ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కామెంట్స్
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏనాడూ మాజీ మంత్రి జీవన్ రెడ్డిని తక్కువ చేసి చూడలేదన్నారు. తనను కలిసిన జగిత్యాల జిల్లా నాయకులతో మాట్లాడారు. తాజా పరిస్థితుల పై వారితో మనసు విప్పి మాట్లాడారు. ఆయన మర్యాదను తగ్గించేలా మాట్లాడ లేదన్నారు. 2023 ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం అంతా కష్టపడ్డాం అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆయనను కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించాం అని చెప్పారు. కానీ, ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేస్తానని కోరినా పార్టీ టికెట్ ఇచ్చిందన్నారు. దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
మొండి పట్టుతో జీవన్ రెడ్డి పార్టీ వీడారంటూ వాపోయారు రేవంత్ రెడ్డి. 40 ఏండ్లు ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను మోసం చేసి దుర్మార్గుడైన కెసిఆర్ తో జతకట్టారని ఆరోపించారు. జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడటం అత్యంత బాధాకరం అన్నారు. ఈనాటికీ నేను ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఒక్క మాట మాట్లాడ లేదని పేర్కొన్నారు. మీరంతా అండగా నిలబడండి… మళ్లీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దాం. ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చారు. త్వరలోనే కార్యకర్తలను కలిసేందుకు జగిత్యాలకు వస్తానని చెప్పారు. అంతా కలిసికట్టుగా జగిత్యాలను అభివృద్ధి చేసుకుందాం. వ్యక్తికంటే పార్టీ ముఖ్యమని నిరూపించిన మీ అందరినీ అభినందిస్తున్నానని అన్నారు.





