నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత శశి థరూర్
న్యూఢిల్లీ : తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ నిప్పులు చెరిగారు. శుక్రవారం పార్లమెంట్ సాక్షిగా కేంద్రం తీసుకు వస్తున్న డీ లిమిటనేషన్ బిల్లును ఏకి పారేశారు. కేవలం రాజకీయంగా లబ్ది పొందేందుకు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఎంపీ ఏకంగా డీలిమిటేషన్ను ‘రాజకీయ డీమోనిటైజేషన్’గా అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ అమలుకు సిద్ధంగా ఉందని, ప్రస్తుత పార్లమెంటరీ బలం ఆధారంగా దానిని తక్షణమే అమలు చేయవచ్చని అన్నారు శశి థరూర్. అయితే మహిళా రిజర్వేషన్ల అమలును పార్లమెంట్ విస్తరణకు ముడిపెట్టడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘నారీ శక్తి’కి ఇచ్చే న్యాయమనే కానుకను “ముళ్లకంచె”లో చుట్టారని కాంగ్రెస్ నాయకుడు అన్నారు.
మహిళా కోటా చట్టంలో సవరణల కోసం, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కోసం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై లోక్సభలో జరిగిన చర్చలో పాల్గొన్నారు ఎంపీ . డీలిమిటేషన్ను వాయిదా వేయాలని థరూర్ డిమాండ్ చేశారు. ‘నూతన భారతదేశం’ వైపు సాగే ప్రస్థానం మనకు విచ్ఛిన్నమైన భారతదేశాన్ని ఇవ్వకుండా చూసు కోవాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ను డీలిమిటేషన్తో ముడి పెట్టడం అంటే, దేశ చరిత్రలోనే “అత్యంత వివాదాస్పదమైన , సంక్లిష్టమైన” పరిపాలనా ప్రక్రియలలో ఒకదానికి భారతీయ మహిళల ఆకాంక్షలను బందీగా ఉంచడమేనని తిరువనంతపురం ఎంపీ అన్నారు. డీలిమిటేషన్కు సంబంధించిన సమస్యలపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు , పౌర సమాజంతో సహా భాగస్వాములందరితో విస్తృత సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేశారు.





