ధీమా వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం
తమిళనాడు : తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇంకా కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉంది ఎన్నికల పోలింగ్ చేపట్టేందుకు. ఈ సందర్బంగా జరిగిన ఎన్నికల ప్రచారంలో నువ్వా నేనా అన్న రీతిలో ఆయా పార్టీలకు చెందిన నేతలు పోటీ పడి నిర్వహించారు. అధికారంలో ఉన్న డీఎంకే, కాంగ్రెస్, ఇండియా కూటమి , అన్నాడీఎంకే, ఎన్డీయే కూటమితో పాటు టీవీకే విజయ్ పోటా పోటీగా క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడులోని కృష్ణగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ ఎ. చెల్లకుమార్ తరపున రోడ్ షో చేపట్టారు.
ముఖ్య అతిథిగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రసంగించారు. ఆయన ఎన్డీయే కూటమిపై నిప్పులు చెరిగారు. మోదీ, అమిత్ షా పాచికలు పారలేదన్నారు. వారి కుట్రలకు తెర పడిందన్నారు. మూడు బిల్లుల పేరుతో నాటకాలు ఆడారని, వారి ఆటలు ఇక సాగవన్నారు. తమిళనాడులోని డీఎంకే సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా ఉన్నాయన్నారు. సామాజిక న్యాయం, సంక్షేమంపై ఆధారపడిన పరిపాలన ప్రజల జీవితాలను ఎలా మార్చగలదో తమిళనాడు దేశానికి చూపించిందన్నారు. . కృష్ణగిరి ప్రజలు సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్కు దృఢంగా అండగా నిలబడి, డాక్టర్ ఎ. చెల్లకుమార్కు ఘన విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.





