సింగ‌పూర్ పాల‌నా విధానం అద్భుతం

VijayaBhaskar · April 25, 2026
Spread the love

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన వంగ‌ల‌పూడి అనిత

సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రులు వంగ‌ల‌పూడి అనిత‌, స‌త్య‌కుమార్ యాద‌వ్, కింజార‌పున అచ్చెన్నాయుడు, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, బీసీ జ‌నార్ద‌న్ రెడ్డిలు సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. సింగ‌పూర్ పాల‌నా విధానం ఎలా ఉంద‌నే దానిపై ఆరా తీశారు. ఇదిలా ఉండ‌గా సింగపూర్ అధ్యయన పర్యటనలో భాగంగా ఐదవ రోజు శనివారం సింగపూర్ సంక్షోభ నిర్వహణ వ్యవస్థ (Singapore’s Crisis Management System)పై లోతుగా అధ్యయనం చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌.

ముఖ్యంగా విపత్తు సమయాల్లో ప్రభుత్వ శాఖలన్నీ ఏకతాటిపైకి వచ్చి సమన్వయంతో పని చేసే ‘హోల్-ఆఫ్-గవర్నమెంట్’ (Whole-of-Government) విధానం గురించి SUSS అసిస్టెంట్ ప్రొఫెసర్ రజ్వానా వివరించిన అంశాలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని చెప్పారు. సంక్షోభంలో నాయకత్వ బాధ్యత, నైతిక నిర్ణయాలు రాబోయే ప్రమాదాలను ముందే ఊహించి సిద్ధంగా ఉండటం వంటి కీలక అంశాలపై స‌హ‌చ‌ర మంత్రులతో కలిసి చర్చించ‌డం జ‌రిగింద‌న్నారు. ఇక్కడ నేర్చుకున్న వినూత్న పద్ధతులను, మన రాష్ట్రంలో ప్రజా భద్రత , విపత్తు నిర్వహణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు ఖచ్చితంగా వినియోగిస్తాం అన్నారు.