దాతను అభినందించిన ఈవో ముద్దాడ రవిచంద్ర
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ)కి నిత్యం పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. కోరిన కోర్కెలు తీరిన భక్తులు తమకు తోచిన మేరకు అందజేస్తూ వస్తున్నారు. తాజాగా టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు రూ.10 లక్షలు, శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాల ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు ప్రవాస భారతీయుడైన భక్తుడు.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉంటున్న ఐటి సంస్థ యజమాని శ్రీ ససపు శ్రీనివాస్ ఈ విరాళాలను అందజేశారు. ఈ మేరకు ఈ విరాళాలకు సంబంధించిన డిడిలను టిటిడి ఈవో ముద్దాడ రవిచంద్రకు తిరుపతి లోని టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో అందించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నంకు చెందిన చీఫ్ ఇంజనీర్ డి. శ్రీనివాస్ రావు, రైల్వే అధికారి సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.





