ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో
ఒంటిమిట్ట/ తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో సీతా జయంతి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయంలోని రంగ మండపంలో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు.
అనంతరం విష్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యా హవచనం, ఆరాధన, నిర్వహించారు. ప్రత్యేకంగా సీతమ్మవారికి “వాసంతిక పూజ” మల్లె పూలతో సహస్ర నామ అర్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవిన్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కోదండరాముడి సన్నిధిలో జరిగిన సీతా జయంతి ఉత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.





