ఆలయంలో మే 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహణ
తిరుపతి : టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. మే 1న శ్రీ గోవిందరాజ స్వామివారి పొన్నకాల్వ ఉత్సవం జరుగుతుంది. 8, 15 తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తారు. 9న శ్రవణ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
మే 12న హనుమ జయంతి జరుపుకుంటారు. 18న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధి స్వామివారు మాడ వీధుల్లో ఊరేగుతారు. అదే రోజు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఇక 21 నుండి 30వ తేదీ వరకు నమ్మాళ్వార్ ఉత్సవాలు జరుగుతాయి. 22న శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. 23 నుండి 31 వరకు శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, 23న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 27న గరుడ వాహనం, మే 30న రథోత్సవం నిర్వహిస్తారు. 31న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.







