సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రజాశాంతి పార్టీ చీఫ్
హైదరాబాద్ : ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్ , ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్ ) పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆదివారం పాల్ మీడియాతో మాట్లాడారు. కవిత పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్తో ఉన్న విభేదాల వల్లే కవిత పార్టీ పెట్టారని పాల్ విమర్శించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, వైఎస్ షర్మిల పార్టీలు నిలబడలేక పోయాయని, కవిత మనుగడ కష్టమేనని అభిప్రాయపడ్డారు.
ఇలాంటి నిలకడలేని వాళ్లను నమ్మి ప్రజలు మళ్లీ మోసపోవొద్దని పాల్ ప్రజలకు సూచించారు. తమ స్వప్రయోజనాల కోసం పార్టీ పెట్టే వాళ్ల గురించి ఆలోచించ వద్దని కోరారు పాల్. తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేసిందో చెప్పాలన్నారు. తెలంగాణను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించారని ఆరోపించారు. ప్రజలు ఆమెను, పార్టీని నమ్మే పరిస్థితిలో లేరన్నారు డాక్టర్ కేఏ పాల్. ప్రజలు ఆమెను చూసి నవ్వుకుంటున్నారని ఆరోపించారు. తను కూడా మరో షర్మిల, చిరంజీవి కాక తప్పదన్నారు.





