అజ్ఞాత భక్తుడి సేవాభావం ఈవో సంతోషం
తిరుపతి : కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కునేందుకు భక్తులు నిత్యం తండోపతండాలుగా తరలి వస్తుంటారు. తమ మొక్కులు తీర్చుకుంటారు. పెద్ద ఎత్తున నగదు, ఆభరణాల రూపేణా చెల్లించుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విద్య, వైద్యం, అన్నదానం అందుబాటులోకి తీసుకు వచ్చింది టీటీడీ. భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు సమర్పించుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా
శ్రీవారి సేవలో భాగంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్కు హైదరాబాద్కు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు రూ.1,00,10,116 విరాళం అందజేశారు.
టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో విరాళం డిమాండ్ డ్రాఫ్ట్ను టిటిడి ఈవో ఎం. రవిచంద్రకు అందజేశారు. ఈ సందర్భంగా అజ్ఞాత భక్తుడి దాతృత్వాన్ని ఈవో అభినందించారు. అన్నప్రసాద సేవకు ఇది ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా భువనేశ్వర్ కు చెందిన బల్భద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,01,000 విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి రాఘవేంద్ర తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.







