బిగ్ సక్సెస్ అయ్యిందన్న నారా లోకేష్
అమరావతి : పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించేందుకు ‘100-రోజుల కార్యాచరణ ప్రణాళికను మంత్రి నారా లోకేష్ అమలు చేశారు. 2025 డిసెంబర్ 6 నుంచి 2026 మార్చి 15 వరకు పకడ్బందీగా అమలు చేసిన ఈ ప్రణాళికలో, విద్యార్థులపై ఒత్తిడి లేకుండా 46 స్లిప్ టెస్టులు నిర్వహించారు. ఈ మార్కులను ‘లీప్’ మొబైల్ యాప్లో నమోదు చేసి, ప్రతిరోజూ 6 డ్యాష్బోర్డ్ల ద్వారా విశ్లేషించారు. స్లిప్ టెస్టులలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వారిని ‘షైనింగ్ స్టార్స్’, ‘రైజింగ్ స్టార్స్’గా గుర్తించారు. వారి వారి సామర్థ్యాలకు అనుగుణంగా ప్రత్యేక బోధన అందించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. విద్యాశాఖ ప్రత్యేకంగా మోడల్ పేపర్లు, క్వశ్చన్ బ్యాంకులను ఉచితంగా అందించింది.
ముఖ్యంగా, నాన్-లాంగ్వేజ్ సబ్జెక్టుల కోసం ద్విభాషా (బై-లింగ్యువల్) పద్ధతిలో, ఒకవైపు తెలుగు మరోవైపు ఇంగ్లీషులో ప్రశ్నపత్రాలు రూపొందించి ఇవ్వడం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడింది. డ్యాష్బోర్డ్ విశ్లేషణ ద్వారా విద్యార్థుల బలాబలాలను అనుగుణంగా ప్రతి పాఠశాలకు 15 కార్యాచరణ ప్రణాళిక పుస్తకాలను పంపిణీ చేశారు. స్లిప్ టెస్టులలో వెనుకబడిన విద్యార్థుల కోసం 30 రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ను ప్రత్యేకంగా నిర్వహించి, వారిపై దృష్టి సారించారు. పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రీ-ఫైనల్, గ్రాండ్ టెస్టులు నిర్వహించారు. పునాది దశ నుంచి సమస్యల మూలాలు తెలుసుకుని, వాటిని అధిగమించేందుకు కృషి చేస్తూ, ప్రభుత్వ విద్యార్థులకు కావాల్సిన బోధన, బడిలో సౌకర్యాలు, నిపుణులైన ఉపాధ్యాయుల నియామకం వంటి వాటిపై దృష్టి సారించారు. దీంతో సత్ఫలితాలు వస్తున్నాయి.





