దాతలను అభినందించిన టీటీడీ చైర్మన్ నాయుడు
తిరుమల : టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ నుండి రూ.2.50 కోట్లు విరాళంగా అందాయి. తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆ సంస్థ ట్రస్టీ అనురాగ్ చౌదరి, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుకు విరాళం డీడీని సమర్పించారు. ఈ సందర్భంగా దాత అనురాగ్ చౌదరి కుటుంబ సభ్యుల దాతృత్వాన్ని టీటీడీ ఛైర్మన్ అభినందించారు. పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిధులు ఎంతో ఉపయుక్తమవుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, సదాశివరావు, జంగా కృష్ణమూర్తి, శాప్ ఛైర్మన్ శ్రీ రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం స్వామి వారు స్వర్ణ రథంపై ఊరేగుతారు.
బంగారు తేజస్సుతో అలంకరించిన స్వర్ణ రథంపై దివ్య మంగళ దర్శనం ఇవ్వనున్నారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు.







