చంద్ర‌బాబు నివాసంలో ప్ర‌ధాని మోదీ

VijayaBhaskar · May 11, 2026
Spread the love

శ్రీవారి చిత్ర‌ప‌టం బ‌హూక‌రించిన సీఎం

హైద‌రాబాద్ : ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. విచిత్రం ఏమిటంటే ఆయ‌న ఏపీకి సీఎం. కానీ అంతా ఇక్క‌డే ఉంటారు. ఇక ప్ర‌ధాని స్వ‌యంగా ఆయ‌న‌ నివాసానికి వెళ్లారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో పర్యటిస్తున్న మోదీ.. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి చేరుకుని ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రధానికి సాదర స్వాగతం పలికారు.

ప్రధాని రాకను తమ కుటుంబానికి దక్కిన గొప్ప గౌరవంగా, చిరస్మరణీయ క్షణంగా చంద్రబాబు అభివర్ణించారు. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, కేంద్రం నుంచి అందాల్సిన సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో.. కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయం.. విభజన హామీల అమలుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాని మోదీకి జ్ఞాప‌కంగా క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి చిత్ర ప‌టాన్ని బ‌హూక‌రించారు.