రహదారి భద్రత, డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాలు
తిరుమల : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుమలలోని సేవాసదన్లో మహిళల భద్రతపై తిరుమల సబ్ డివిజన్ పోలీసులు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీవారి సేవకులు హాజరై మహిళల భద్రతకు సంబంధించిన పలు ముఖ్య అంశాలపై అవగాహన పొందారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రహదారి భద్రత, డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, మహిళల భద్రతకు సంబంధించిన జాగ్రత్తలపై సమగ్రంగా వివరించారు. సామాజిక మాధ్యమాలు, ఫోన్ కాల్స్, ఆన్లైన్ లావాదేవీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం నొక్కి చెప్పారు.
అదేవిధంగా, మహిళలు ఎలాంటి ఆపద పరిస్థితులు ఎదురైనప్పటికీ భయపడకుండా వెంటనే స్పందించి సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించాల్సిన విధానం గురించి వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన టోల్ఫ్రీ నంబర్లు, పోలీసు సహాయ సేవల వివరాలను కూడా సమావేశంలో తెలిపారు. మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, అప్రమత్తతతో వ్యవహరించడం ద్వారా అనేక నేరాలను ముందుగానే నివారించవచ్చని సూచించారు. శ్రీవారి సేవకులు కూడా యాత్రికుల భద్రతలో భాగస్వాములుగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.







