చావు కబురు చల్లగా చెప్పిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ : ఈఏడాదిలో నిర్వహించిన నీట్ – యుజి 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). పేపర్ లీక్ అయ్యిందని , దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని ఆదేశించినట్లు కేంద్రం తెలిపింది. కాగా ఎన్టీఏ ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. తనకు అప్పగించిన జాతీయ పరీక్షలను నిష్పక్షపాతంగా, సురక్షితంగా, విశ్వసనీయంగా నిర్వహించాలనే తన చిరకాల నిబద్ధతకు అనుగుణంగా, 8 మే 2026న, అప్పటికి పరిశీలనలో ఉన్న అంశాలను స్వతంత్ర ధృవీకరణ మరియు అవసరమైన చర్యల నిమిత్తం కేంద్ర సంస్థలకు NTA సిఫార్సు చేసింది.
కేంద్ర సంస్థల సమన్వయంతో NTA తదనంతరం పరిశీలించిన సమాచారం (inputs) ఆధారంగా, అలాగే చట్ట అమలు సంస్థలు పంచుకున్న దర్యాప్తు ఫలితాల దృష్ట్యా, వ్యవస్థలో పారదర్శకత ఉండేలా చూడాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వ ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే, 3 మే 2026న నిర్వహించిన NEET (UG) 2026 పరీక్షను రద్దు చేసి, వేరేగా తెలియ జేయబడే తేదీలలో ఆ పరీక్షను తిరిగి నిర్వహించాలని నిర్ణయించింది.
NTAకి అందిన సమాచారాన్ని, చట్ట అమలు సంస్థలు పంచుకున్న దర్యాప్తు ఫలితాలతో కలిపి పరిశీలించినప్పుడు, ప్రస్తుత పరీక్షా ప్రక్రియను కొనసాగించడానికి వీలులేదని స్పష్టమైంది. తిరిగి నిర్వహించే పరీక్షా తేదీలు, అలాగే సవరించిన అడ్మిట్ కార్డుల జారీ షెడ్యూల్ వివరాలు రాబోయే రోజుల్లో ఏజెన్సీ అధికారిక మాధ్యమాల ద్వారా తెలియ చేస్తామని పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు, ఈ విషయాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దర్యాప్తుకు అవసరమైన అన్ని రకాల సామగ్రి, రికార్డులు సహాయాన్ని అందిస్తూ, బ్యూరోకు NTA పూర్తి సహకారం అందిస్తుంది.
విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, జాతీయ పరీక్షా వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పరీక్షను తిరిగి నిర్వహించడం వల్ల అభ్యర్థులకు, వారి కుటుంబాలకు నిజమైన, గణనీయమైన అసౌకర్యం కలుగుతుందని ఏజెన్సీకి పూర్తి అవగాహన ఉంది. ఈ పర్యవసానాన్ని NTA ఏమాత్రం తేలికగా తీసుకోవడం లేదు. ఒకవేళ ఈ నిర్ణయం తీసుకోక పోయి ఉంటే, ఆ విశ్వాసానికి మరింత తీవ్రమైన, దీర్ఘకాలిక నష్టం వాటిల్లి ఉండేది; అందుకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపింది.
మే 2026 పరీక్షా చక్రంలో నమోదు చేసుకున్న వివరాలు (registration data), అభ్యర్థిత్వాలు , ఎంచుకున్న పరీక్షా కేంద్రాల వివరాలు తిరిగి నిర్వహించే పరీక్షకు కూడా యథాతథంగా వర్తిస్తాయని పేర్కొంది. దీని కోసం అభ్యర్థులు మళ్ళీ కొత్తగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది , అలాగే ఎటువంటి అదనపు పరీక్షా రుసుము కూడా వసూలు చేయబడదు. అంతేకాకుండా, విద్యార్థులు ఇప్పటికే చెల్లించిన రుసుములు వారికి తిరిగి చెల్లించ బడతాయని పేర్కొంది.





